- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఘటన
రేగొండ, వెలుగు : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఎనిమిదేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రేగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో బాలిక తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటి వద్దే ఆడుకుంటోంది.
మద్యం మత్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన గణేశ్, శ్రీకాంత్ అనే యువకులు బాలికను గమనించారు. శ్రీకాంత్ బాలికను ఎత్తుకొని తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. ఇంటి ముందు గణేశ్ కాపలా ఉన్నాడు. చిన్నారి కేకలు విన్న ఆమె ఫ్రెండ్స్ పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. గమనించిన శ్రీకాంత్, గణేశ్ తీవ్ర రక్తస్రావంతో నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని తిరిగి ఆమె ఇంటి వద్ద దింపి అక్కడి నుంచి పారిపోయారు.
కొద్దిసేపటి తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు చిన్నారితో మాట్లాడగా.. అసలు విషయం చెప్పింది. ఆమెను వెంటనే జిల్లా కేంద్రంలోని హాస్పిటల్కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రేగొండ ఎస్సై రాజేశ్ తెలిపారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు
అత్తపై అల్లుడు అత్యాచారం, హత్య
కల్వకుర్తి, వెలుగు : ఓ యువకుడు తన అత్తపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో సోమవారం వెలుగుచూసింది. కల్వకుర్తి సీఐ బి.నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం... రఘుపతిపేటకు చెందిన చెన్నమ్మ (65)కు ఇద్దరు కుమారులు చనిపోగా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
రెండో కూతురు రేణుకను 15 ఏండ్ల కింద అదే గ్రామానికి చెందిన రాఘవేందర్కు ఇచ్చి వివాహం చేసింది. చెన్నమ్మ ఇటీవల రేణుక ఇంటికి వెళ్లింది. రేణుక ఆదివారం తన అక్క ఊరికి వెళ్లగా.. చెన్నమ్మ, రాఘవేందర్ ఇద్దరే ఇంట్లో ఉన్నారు. దీంతో ఆదివారం రాత్రి రాఘవేందర్ తన అత్తపై అత్యాచారం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ నాగార్జున తెలిపారు.
